రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం... సీఎం చంద్రబాబు స్పందన

  • రాయలసీమలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు
  • రూ.3000 కోట్ల పెట్టుబడితో 11 నెలల్లోనే నిర్మాణం పూర్తి
  • పరిశుభ్ర ఇంధన రంగంలో ఏపీ ముందు వరుసలో ఉందని వెల్లడి
  • రికార్డు సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఎస్ఏఈఎల్ బృందానికి అభినందనలు
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. 

"వ్యాపార నిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), కార్యనిర్వహణ వేగం (స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్) రెండూ కలిసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజు, రాయలసీమలో ఎస్ఏఈఎల్ సంస్థ నిర్మించిన 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును మన ప్రజలకు అంకితం చేశాం.

రూ.3,000 కోట్ల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ చరిత్రాత్మక ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. సుస్థిర భవిష్యత్తు పట్ల మాకున్న తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనం. భారతదేశ స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెడుతున్న ఇలాంటి ప్రాజెక్టులు మాకు ఎంతో గర్వకారణం.

ఈ ప్రాజెక్టును ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసిన ఎస్ఏఈఎల్ ఇండియా బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు ద్వారా మన ప్రజలకు ఉద్యోగాలు, అభివృద్ధి, కొత్త అవకాశాల రూపంలో గణనీయమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Chandrababu Naidu
Andhra Pradesh
Rayalaseema
SAEL
Solar Project
Nara Lokesh
Renewable Energy
Sukbhir Agro Energy Limited
Kadapa
T Konduru

More Telugu News